కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ నగరంలోని ఏనుమాముల మార్కెట్ సోమవారం మిర్చి బస్తాలతో నిండిపోయింది. శని, ఆదివారాలు మార్కెట్ బంద్ ఉండడంతో సోమవారం రైతులు భారీ మొత్తంలో మిర్చిని తీసుకొచ్చారు. సోమవారం ఒక్కరోజే మార్కెట్కు 80 వేల నుంచి లక్షకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. మిర్చి సీజన్ ప్రారంభం నుంచి ఈ స్థాయిలో పంట రావడం ఇదే మొదటిసారని మార్కెట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
మరోవైపు క్వింటాల్ మిర్చి గరిష్టంగా రూ.20 వేలు పలుకగా.. కనిష్ట ధరలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని రైతులు అంటున్నారు. రికార్డు స్థాయిలో మిర్చి మార్కెట్కు రావడంతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి ధరల తగ్గింపుపై మార్కెట్ ఆఫీసర్లకు, పాలకవర్గానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం రైతులు ఆరోపించారు. అలాగే సోమవారం ఏనుమాముల మార్కెట్కు మక్కలు సైతం భారీమొత్తం వచ్చాయి.

